Srisailam Power House | శ్రీశైలం తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తికి నాల్గో యూనిట్ సిద్ధమైంది. అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న యూనిట్కు అధికారులు మరమ్మతులు పూర్తి చేసి.. శనివారం పవర్గ్రిడ్కు అనుసంధానించారు. జెన్కో సీఎండీ పర్యవేక్షణలో ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ ఎడమగట్టులో అధికారులు సాంకేతిక నిపుణులతో కలిసి మెకానికల్ స్పింజన్, ఎలక్ట్రికల్ స్పింజన్ మరమ్మతు పనులు పూర్తి చేసి.. విజయవంతంగా ట్రయిల్ రన్ నిర్వహించారు.
జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం, చీఫ్ ఇంజినీర్ సూర్యనారాయణ, ఎస్ఈ సద్గుణ కుమార్, ఆదినారాయణ, డీఈ జనరల్, డీఈ ఎంఎం, డీఈ ఎ అండ్ సీ, ఏడీలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, ఓఅండ్ఎం సిబ్బంది, ఆర్టిజన్స్ సమష్టి కృషితో యూనిట్ పునః ప్రారంభమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం యూనిట్ను పూలమాలలతో అలంకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిర్విరామంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగాలని ఆకాంక్షిస్తూ.. శాస్త్రోక్తంగా పూజలు చేశారు.
2020 ఆగస్టు 21న రాత్రి అర్ధరాత్రి సమయంలో నాల్గో యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మరమ్మతులు పూర్తి చేసిన జెన్కో అధికారులు.. మొత్తం ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్కు వచ్చే వరద నీరు 850 అడుగులు దాటిన తర్వాత ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.