మహబూబ్నగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆపత్కాలంలో వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన పాలమూరు మెడికోల సేవలు వెలకట్టలేనివని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొదటిబ్యాచ్ విద్యార్థులు తమ ఫైనల్ ఇయర్ ఫలితాలు రాకముందే సేవలందించేందుకు ముందుకురావడంపై హర్షం వ్యక్తంచేశారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్న ఈ వైద్యులు దైవానికి ప్రతిరూపాలని అభివర్ణించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో శ్రీనివాస్గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ తొలి ప్రభుత్వ మెడికల్ కళాశాలను మహబూబ్నగర్కు అందించారు. ముందుచూపుతో మెడికల్ కళాశాల ఏర్పాటుచేయడం వల్లే ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తున్నా.. స్థానికంగానే వైద్యం అందుతున్నది. ప్రస్తుతం 500 పడకల కొవిడ్ వార్డు ఉమ్మడి జిల్లా వాసులందరికీ సేవలందిస్తున్నది. కొవిడ్ కేసులు పెరిగి వైద్యులపై తీవ్ర భారం పడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో చివరి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థులు 140 మంది సేవలను ప్రభుత్వ జనరల్ దవాఖానలో వినియోగించుకుంటున్నాం. వీరి వల్ల దవాఖానలో రెగ్యులర్ వైద్యులపై భారం తగ్గుతున్నది. అత్యంత క్లిష్ట సమయంలో.. మెడికోలు ముందుకొచ్చి వైద్య సేవలందించడం ఎంతో గొప్ప విష యం. వీరిని అభినందిస్తున్నాం. అందుకే ప్రత్యేకంగా వీరితో సమావేశమయ్యాం. సేవ చేయాలని విద్యార్థులను ప్రోత్సహించాను.
తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్నగర్లో జిల్లా దవాఖాన మాత్రమే ఉండేది. 15 మంది వైద్యులే సేవలందించేవారు. చిన్న సమస్య వచ్చినా రోగులను హైదరాబాద్కు తీసుకువెళ్లాల్సి వచ్చేది. మహబూబ్నగర్కు మెడికల్ కళాశాల వచ్చాక జనరల్ దవాఖానలో 200 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చారు. వైద్య, ఇతర సిబ్బంది సంఖ్య భారీగా పెరిగింది. కార్పొరేట్కు తీసిపోకుండా 24 గంట లు వైద్యసేవలు అందుతున్నాయి. అత్యాధునిక ల్యాబ్లు, సదుపాయాలు వచ్చాయి. కొవిడ్ వేళ హైదరాబాద్ నుంచే మహబూబ్నగర్ వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ విజన్కు నిదర్శనం.
కరోనా వచ్చాక మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానలో తగిన సదుపాయాలు కల్పించాం. ఫీవర్ క్లినిక్, ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటుచేశాం. కొవిడ్ వార్డులో 500 పడకలతో వైద్యం అందిస్తున్నాం. ఇందులో 290 పడకలకు పైప్లైన్ ద్వారా ఆక్సిజన్ అందుతుంది. త్వరలోనే పాలమూరులో 500 ఆక్సిజన్ పడకల స్థాయికి కొవిడ్ వైద్యం చేరుకుంటుంది. రాష్ట్రంలో గాంధీ, ఉస్మానియా తర్వాత తొలిసారిగా మహబూబ్నగర్లోనే ఆక్సిజన్ ప్లాంట్ (13 కిలో లీటర్ల సామర్థ్యం) ఏర్పాటుచేసుకున్నాం. కొవిడ్ రోగి దవాఖానలో చేరిన రోజునుంచి ఆరోగ్యంగా తిరిగి వెళ్లేవరకు పైసా ఖర్చులేకుండా వైద్యం అందిస్తున్నాం. వైద్యులు, సిబ్బందికి నిత్యం ప్రభుత్వమే భోజన సౌకర్యం కల్పిస్తున్నది.ఇప్పటివరకు సుమారు 66 వేలమందికి ప్రభుత్వ జనరల్ దవాఖానలో కొవిడ్ వైద్య సేవలు అందగా.. అందులో 3,550 మందికి కొవిడ్ కేర్ సెంటర్లో వైద్యసేవలందాయి. 70 మంది వైద్యులు, 60 మంది నర్సులు, ఇతర సిబ్బంది కొవిడ్ బారినపడ్డారు. కోలుకున్నాక మళ్లీ ఉత్సాహంగా విధుల్లోకి వచ్చి సేవలందిస్తున్నారు. దవాఖాన రోజుకు 3 వేలమందికిపైగా రోగులను పరీక్షించేస్థాయికి చేరింది.