హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సరఫరా చేయాలన్న షరతు మీద విద్యుత్తు సబ్స్టేషన్ నిర్మాణం నిమిత్తం ఉచితంగా ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. భూమితోపాటు పరిహారం ఇప్పించాలంటూ శ్రీ అభిషేక్ స్టీల్స్ అండ్ పవర్ లిమిటెడ్ దాఖలుచేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలో తమ ఫ్యాక్టరీ స్థలంలో ఏర్పాటుచేసిన సబ్స్టేషన్ను తొలగించి భూమిని అప్పగించేలా టీఎస్ఎస్పీడీసీఎల్కు ఆదేశాలు జారీ చేయాంటూ శ్రీ అభిషేక్ స్టీల్స్ అండ్ పవర్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. గుండ్లపోచంపల్లిలో ప్రత్యేక ఫీడర్ ద్వారా విద్యుత్తు సరఫరా చేస్తామన్న నిబంధన కింద స్టీల్ ఫ్యాక్టరీకి చెందిన 4ఎకరాల భూమిలో సబ్స్టేషన్ ఏర్పాటుకు అనుమతిస్తూ 1988లో ఏపీఎస్ఈబీకి లేఖ ఇచ్చినట్టు చెప్పారు.
ప్రత్యేక ఫీడర్ లైన్ ద్వారా విద్యుత్తు సరఫరా చేయలేదని తెలిపారు. ఫ్యాక్టరీ మూతపడిందని, ఆస్తులను బ్యాంకు వేలం వేసిందని వివరించారు. దీంతో సబ్స్టేషన్ ఏర్పాటుకు గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకున్నామని, భూమిని తమ స్వాధీనంతోపాటు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. టీఎస్ఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది శ్రీధర్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఫ్యాక్టరీకి ఫీడర్ లైన్ ద్వారా విద్యుత్తు సరఫరా చేస్తామని హామీ ఇవ్వలేదని తెలిపారు. ఫ్యాక్టరీ సమ్మతి లేఖలో ఏపీఎస్ఈబీని యజమానిగా పేరొందని, ఫ్యాక్టరీ, వారసులు ఆ భూమిపై హకులు కోరబోమని పేరొన్నారని గుర్తుచేశారు.