న్యూఢిల్లీ, జూలై 12 (నమస్తే తెలంగాణ): విపత్తు నిధుల విడుదలలోనూ కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపింది. అరకొర సాయాన్ని ప్రకటించడం ద్వారా తెలంగాణ మీద ప్రేమ ఏపాటిదో చెప్పకనే చెప్పింది. ఈ ఏడాది వేసవిలో తెలంగాణవ్యాప్తంగా అకాల వర్షాలతో భారీగా నష్టపోయిన రైతంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఎలాంటి సాయాన్ని ప్రకటించలేదు. ఇప్పటికే రాష్ర్టానికి అందాల్సిన నిధుల విషయంలో స్పందించని కేంద్రం పక్క రాష్ర్టమైన ఏపీకి అధిక మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నది. విపత్తు సాయం కింద రాష్ర్టాలకు 7,532 కోట్లు కేంద్రం విడుదల చేసింది.
ఆర్థికశాఖ వ్యయ విభాగం బుధవారం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ (ఎస్డీఆర్ఎఫ్) కోసం 22 రాష్ర్టాలకు నిధులను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.188.8 కోట్లు ఆంధ్రప్రదేశ్కు రూ.493.6 కోట్ల నిధులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టాలకు అందించిన మొత్తానికి సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురుచూడకుండా ఆయా మార్గదర్శకాలను సడలించి, తక్షణ సాయంగా ఈ మొత్తాన్ని విడుదల చేసింది. తెలంగాణకు తక్కువ కేటాయింపులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.