హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీస్ భవన నిర్మాణాల పనులను త్వరగా పూర్తి చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీల కార్యాలయాల పనుల పురోగతిపై శుక్రవారం ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎండీ సంజయ్కుమార్ జైన్తో కలిసి సంబంధిత ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తికావచ్చిన రామగుండం పోలీస్ కమిషనరేట్, గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల పోలీస్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని డీజీపీ తెలిపారు. ఈ భవనాలకు డిసెంబర్ 20లోగా తుది మెరుగులు దిద్ది ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. వివిధ స్థాయిల్లో ఉన్న మిగిలిన పోలీస్ భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కోలేటి దామోదర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 13 ఎస్పీ కార్యాలయాలు, రెండు సీపీ కార్యాలయాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఎస్కే జైన్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విభాగం ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.