సిటీబ్యూరో : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే జోనల్ అధికారులు (Zonal Officers ) బుధవారం వెల్లడించారు. హైదరాబాద్-తిరుపతి, గోరక్పూర్-మహబూబ్నగర్, విశాఖపట్నం-సికింద్రాబాద్, తిరుపతి-విశాఖపట్నం వంటి పలు రైల్వే స్టేషన్ల మధ్య 16 వారాంతపు ప్రత్యేక రైళ్లను (Special Trains) పొడిగిస్తున్నామని వివరించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 29 వరకు తేదీల వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
భక్తుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్-వాడీ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తూ ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1న నిర్వహించే సెయింట్ హజరత్ క్వాజా సయ్యద్ మహ్మద్ బదేశ్ ఖాద్రి 46 వసంతాల ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో దానికి హాజరయ్యే భక్తుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆగస్టు 1, 3 తేదీలలో రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. గుంతకల్-మద్దెకెర రైల్వే స్టేషన్ల మధ్య విద్యుదీకరణ పనులతో పాటు డబుల్ రైల్వే లైను పనులు 10.7 కిలో మీటర్ల దూర మేరకు పూర్తికావడంతో బుధవారం ఈ రైల్వే లైను ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.