Telangana | పడ్డ చినుకు పడ్డట్లుగనే.. వచ్చిన వరద వచ్చినట్టే.. దిగువకు జలజలా జారిపోవుడే.. సంద్రంపాలు కావడమే.. నీళ్ల మురిపమూ మూణ్నాళ్ల ముచ్చటే.. వానలు కురిసిన నాలుగొద్దులె.. గోదారంతా ఎడారే.. ఇదీ నిన్నటి గతం.. చేదు నిజం..
నేడు గోదావరి తీరమొక జలదృశ్యకావ్యం. ఈ దరి నుంచి ఆ దరికి మధ్యన ఓలలాడుతూ.. ఈ మూల నుంచి చివరి మూల వరకు 400 కి.మీ. తుళ్లిపడుతూ.. గోదావరి గుండెనిండుగా కనుచూపు మేర కనువిందు చేసే జలతోరణం.. తీరం లోలోపలే ఒదిగి ఒదిగి పారుతూ మైమరిపిస్తున్నది. ఇది కాకతీయుల గొలుసుకట్టు విధాన స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన అద్భుతం.. పదేండ్ల ఆచరణకు దక్కిన జలఫలం..
కాకతీయులు అనగానే జలసాధనకు వారు పాటించిన గొలుసుకట్టు విధానం గుర్తుకొస్తుంది. నీటి ఊట, గుట్టలు ఎక్కడ ఉంటే అక్కడ చెరువులు తవ్వారు. ఒక చెరువుతో మరో చెరువును లంకెపెట్టారు. జలాలను ఒడిసిపట్టి పొలాలకు మళ్లించారు. ఇప్పటివరకు చెరువులకే పరిమితమైన ఆ విధానాన్ని అపర భగీరథుడు సీఎం కేసీఆర్ మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. భారీ ప్రాజెక్టుల్లోనూ గొలుసుకట్టు విధానాన్ని అమలు చేస్తూ అద్భుత జలదృశ్యాలను ఆవిష్కరిస్తున్నారు. కాకతీయుల స్ఫూర్తితో.. బీళ్ల దాహార్తిని తీర్చేందుకు బాటలు వేస్తూ ఎడారిలా మారిన గోదారిని తెలంగాణ నఖశిఖ పర్యంతం సజీవధారగా తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో గోదావరి పొడవునా నిర్మించిన వరుస బరాజ్లు సరికొత్త జలదృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. గోదావరి నదిపైనే కాకుండా దాని ఉపనదులైన మానేరు, మంజీరా, వాగులు, వంకలపైనా వరుస చెక్డ్యాంలను నిర్మిస్తున్న ఫలితంగా తెలంగాణ నేడు జలభాండాగారంగా రూపుదిద్దుకుంటున్నది.
గోదావరి నది నిజామాబాద్ కందకుర్తి నుంచి ఖమ్మం జిల్లా బూర్గంపాడు వరకు 644 కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహిస్తున్నది. సమైక్య పాలనలో నిర్మించిన రిజర్వాయర్లు రెండే. వాటి సామర్థ్యం మొత్తంగా 110 టీఎంసీలు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం సుదీర్ఘ మేధోమథనం సాగించి శ్రీకారం చుట్టిన కాళేశ్వరంతో గోదావరి రూపురేఖలే మారిపోయాయి. మొత్తంగా 400 కిలోమీటర్ల గోదావరి సజీవం అవుతున్నది. ఎస్సారెస్పీ దిగువన 37 కిలోమీటర్ల సదర్మాట్, దాని దిగువన 143.5 కి.మీ వద్ద ఎల్లంపల్లి, 29.49 కి.మీ వద్ద పార్వతీ బరాజ్, 31.74 కి.మీ వద్ద సరస్వతీ, 45.87 కి.మీ వద్ద లక్ష్మీ బరాజ్, 46.37 కి.మీ వద్ద సమ్మక్క బరాజ్ను నిర్మించారు.
ఒక బరాజ్ వద్ద నిల్వ చేసిన నీరు మరో బరాజ్ను తాకే విధంగా నిర్మించడం విశేషం. నదీ తీరంలోపలే నీరు నిలిచేలా డిజైన్ చేయడం మరో విశేషం. ఫలితంగా శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరి నది మొత్తం తీరం పరిధిలోనే నిత్యం సజీవంగా మారుతున్నది. సీతమ్మసాగర్ మినహా, అన్ని నిర్మాణాలు పూర్తికాగా, 274 కి.మీ.ల నది సజీవంగా మారింది. సీతమ్మసాగర్ కూడా పూర్తయితే మరో 115 కి.మీ.ల మేర జలకళ రానున్నది. తెలంగాణలో ప్రవహిస్తున్న మొత్తం పొడవులో 62.11% సజీవంగా నిలువనున్నది. అదీగాక మొత్తంగా గోదావరిలోనే 171.19 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నది.
☛హైడ్రాలజికల్ సైకిల్ ప్రకారం.. నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తుంది. వర్షపాతం సమృద్ధిగా ఉండాలంటే అందుకు ప్రధానంగా కావాల్సింది నీరే. ఎంత మేరకు నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ఆ మేరకు వర్షపాతం ఉంటుంది. నదీగర్భ జలాశయాలతో వర్షపాతం పెరుగుతుంది.
☛ సుదీర్ఘకాలం పాటు నీరు ప్రవహించకుంటే నదీ తీరాలు కుచించుకుపోయి, వరద వస్తే కోతకు గురవుతాయి. అలా కాకుండా ఉండాలంటే నదిలో నిరంతరం ఎంతో కొంత నీరు ప్రవహిస్తుండాలి. అందుకు ప్రభుత్వం నిర్మించిన నదీగర్భ జలాశయాలు ఎంతో దోహదం చేస్తాయి. నదీ తీరం కుచించుకుపోకుండా, వరద వచ్చినా తీరం కోతకు గురి కాకుండా కాపాడుతాయి.
☛ గోదావరి తీరం వెంట ఇరువైపులా అటవీ పరచుకుని ఉన్నది. ప్రస్తుతం జలాలు కూడా నిల్వ ఉండడం వల్ల ఆ ప్రాంతం మొత్తంగా ఎకో టూరిజం స్పాట్గా మారుతున్నది. తద్వారా పర్యాటకరంగం విస్తరిస్తున్నది.
☛ భూగర్భ జలాల పెరుగుదలకు ఎంతో దోహదపడతాయి. నిల్వ చేసుకున్న సుమారు 200 టీఎంసీలను వినియోగించుకోవచ్చు. గోదారివరి నది పొడవునా, చుట్టూ 100 కి.మీ.ల మేర భూగర్భ జలాలు పెరుగుతాయి. తద్వారా అదనంగా మరో 50 టీఎంసీలను కూడా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. తాగునీటి, పారిశ్రామిక నీటి అవసరాలకు కూడా కొరత ఉండదు.
☛ ప్రస్తుతం సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ వద్ద హైడల్ ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇవి పూర్తయితే కేవలం వానలు కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా నిరంతరాయంగా జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశముంటుంది. తక్కువ ఖర్చుతో విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.
☛ మంచినీటి మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది.
☛ భవిష్యత్లో లాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే గోదావరిలో దాదాపు 400 కి.మీ.ల మేర జల రవాణాకు కూడా అవకాశముంటుంది. అతితక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సరుకులను తరలించే అవకాశముంటుంది.
…? మ్యాకం రవికుమార్