హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రత్యేక పారిశుద్ధ్య(Special Sanitation Drive) పనులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మే 17 నుంచి 23 వ తేదీ వరకు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు.
శానిటేషన్ డ్రైవ్ పై మంగళవారం అన్ని జిల్లాల పంచాయతి అధికారులతో ఆ శాఖ డైరెక్టర్ హన్మంతరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్సు (Video Conference)నిర్వహించారు. వర్షాకాలం సమీపించే ముందుగా ఎలాంటి అంటువ్యాధులు(Infections) ప్రభలకుండా ముందస్తుగా వారం రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆయన సూచించారు. గ్రామాలలో ప్రతి రోజు రోడ్లు శుభ్రపరచాలని, గుంతలలో నీరు నిల్వ ఉండకుండా పూడ్చివేయాలని వెల్లడించారు.
పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు మురుగునీటి కాలువలు(Sewage drains) శుభ్రపరచాలన్నారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా అన్ని రకాల పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలు(Schools), అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్ స్థలాలు, బస్స్టాప్లు క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా అంటువ్యాధులు విజృంభించకుండా ఫాగింగ్(Fagging), యాంటీ లార్వా(larvae) మెజర్స్ చేపట్టాలని సూచించారు.
గ్రామపంచాయతీలోని ప్రతి ఇల్లు శుక్రవారం డ్రై డేగా పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల సూచనలు, మార్గదర్శకాలు విధిగా పాటించి స్పెషల్ డ్రైవ్ను విజయ వంతం చేయాలని డీపీవోలకు సూచించారు. జిల్లా కలెక్టర్లు సమీక్షలు జరిపి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని వెల్లడించారు. వైకుంఠధామాలకు సోలార్ విద్యుత్ కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు ఆదేశించారు. వైకుంఠధామంలకు నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం సమకూర్చి వినియోగంలోకి తేవాలని కోరారు.