Sanitation Drive | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో బుధవారం నుంచి ఈ నెల 23 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు. ఈ వారం పాటు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టి, ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ డ్రైవ్పై మంగళవారం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానకాలంలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో నిత్యం రోడ్లను శుభ్రం చేయాలని, గుంతలను పూడ్చి వేయాలని సూచించారు. పిచ్చిమొకలను తొలగించడంతో పాటు మురుగునీటి కాలువలను శుభ్రం చేయాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చెప్పారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, మారెట్ స్థలాలు, బస్టాప్లను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. పంచాయతీ పరిధిలోని ప్రతి ఇల్లు శుక్రవారం ‘డ్రై డే’ పాటించేలా చొరవ చూపాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు సమీక్షలు జరిపి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని సూచించారు.
గ్రామానికి దూరంగా ఉన్న వైకుంఠధామాలకు సోలార్ విద్యుత్తును సమకూర్చాలని సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీరు, విద్యుత్తు సదుపాయం లేని వైకుంఠధామాలకు సత్వరమే ఆయా సౌకర్యాలు ఏర్పాటుచేసి వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. వివిధ పంచాయతీల్లో చేపట్టిన కార్యాలయ పక్కా భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. సమీక్షలో ఆ శాఖ డైరెక్టర్ హన్మంతరావు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సంజీవరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.