హైదరాబాద్, డిసెంబర్28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై 110 పేజీలతో ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను (పీపీటీ) ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు రూపొందించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు, రీడిజైన్ అనంతరం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన మార్పులు, చేర్పులు అందులో పొందుపరిచారు. దానిని శుక్రవారం మేడిగడ్డ బరాజ్ను సందర్శించనున్న మంత్రులకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రీడిజైన్, నిర్మాణం, నిర్వహణ, ఆయకట్టు కల్పనపై కాంగ్రెస్ నేతలు ఆదినుంచీ అనేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని పలు పిల్లర్ల కుంగుబాటుకు గురైన నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది.
ఈ ప్రాజెక్టును సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు పలువురు మంత్రులు సందర్శించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుకు సంబంధించి సమస్త వివరాలను అందించాలని, నిర్మాణ ఏజెన్సీలు, సంబంధిత ఇంజినీర్లు అందరూ అందుబాటులో ఉండేలా చూడాలని ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికారులు సిద్ధం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపకల్పన చేసిన ప్రాణహిత-చేవేళ్ల ఎత్తిపోతల పథకం స్వరూపం, చేసిన ప్రతిపాదనలతోపాటు ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేయడానికి కారణాలు, అందుకోసం చేసిన అధ్యయనాలు, రీడిజైన్ ద్వారా అదనంగా ఒనగూరిన ప్రయోజనాలు, సాగులోకి వచ్చిన ఆయకట్టు, పెరిగిన అంచనా వ్యయం, ప్రాజెక్టు నిర్వహణ, కరెంటు చార్జీలు తదితర అంశాలను పీపీటీలో పొందుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతోపాటు నిర్మాణ సందర్భంలో చేసిన పరీక్షలు, డిజైన్లకు సంబంధించిన నివేదికలు, ఫొటోలను కూడా క్రోడీకరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వద్ద తలెత్తిన సమస్యలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను కూడా పొందుపరించారు. బరాజ్ల పునరుద్ధరణ ఏవిధంగా చేపట్టాలి? ఎవరు ఆ బాధ్యత తీసుకోవాలనే అంశాలపై కూడా పొందుపరిచారు.
మేడిగడ్డ బరాజ్ను సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు పలువురు మంత్రులు శుక్రవారం సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్లో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఈఎన్సీ మురళీధర్ బయలుదేరి 11.30 గంటలకు అంబటిపల్లిలోని మేడిగడ్డ బరాజ్కు చేరుకుంటారు. ఆ తరువాత ఇంజినీరింగ్ అధికారులతో ప్రాజెక్టుపై, బరాజ్ కుంగుబాటుపై మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం బరాజ్ను సందర్శిస్తారు. ఆ తరువాత మీడియాకు వివరాలు వెల్లడిస్తారు. తరువాత మేడిగడ్డ నుంచి అన్నారం బరాజ్ను సందర్శించి, అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.