హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఆసరా పింఛన్ నిబంధనలను తెలంగాణ సర్కారు సులభతరం చేసింది. భర్త చనిపోతే ఆయన భార్యకు వెంటనే ఆసరా పింఛన్ అందేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య పింఛను పొందుతున్న వ్యక్తి చనిపోతే వెంటనే ఆయన భార్యకు ఆసరా పింఛను మంజూరు చేయాలని అధికారులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో సందీప్కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో బిల్ కలెక్టర్కు చనిపోయిన వ్యక్తి భార్య ఆధార్ కార్డు, మృతుడి డెత్ సర్టిఫికెట్ సమర్పించాలని సూచించారు. ఈ రెండు డాక్యుమెంట్లను తీసుకొని, ఆ వివరాలను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్కు పంపించాలని తెలిపారు. వీటి కోసం ఆసరా పోర్టల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని వివరించారు.
కలెక్టర్, డీఆర్డీవో ఆమోదానికి ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపించాలని సూచించారు. వృద్ధాప్య పింఛను పొందుతున్న వ్యక్తి చనిపోయిన 15 రోజుల్లో ఈ వివరాలను నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ బిల్ కలెక్టర్లను ఆదేశించారు. ఇతర డాక్యుమెంట్లు ఏవీ అడగొద్దని ఆదేశించారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి పింఛన్ ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని, ఇంటి పెద్ద చనిపోతే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇక్కట్ల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని వివరించారు. రాష్ట్రంలో ప్రతినెలా మొత్తం 44.54 లక్షల మందికి ఆసరా పింఛన్లను అందజేస్తున్నట్టు తెలిపారు. 16.36 లక్షల మంది వృద్ధులకు నెలకు రూ.2016 చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.