హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ)/మేడ్చల్ రూరల్: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కాబోయే అమ్మలకు ప్రభుత్వం భరోసా ఇస్తున్నది. గర్భిణులకు కొవిడ్ సోకితే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణుల కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డులను ఏర్పాటు చేస్తున్నది. కరోనా సోకిన ఇతర బాధితులకు అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలు అందించేందుకు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డు కేటాయించాలని అధికారులను ఆదేశించింది. సెకండ్ వేవ్ సమయంలోనూ ప్రభుత్వ దవాఖానలు గర్భిణులను ఆదుకొన్నాయి. వందలమంది ప్రాణాలు కాపాడాయి. ఇప్పుడు థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి అప్రమత్తం అయింది.
ఈ నెల మొదటి వారంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్వోలు, టీచింగ్ దవాఖానల సూపరింటెండెంట్లు, యూపీహెచ్సీ, పీహెచ్సీల వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని దవాఖానల్లో గర్భిణులకు కొవిడ్ సోకితే చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ దవాఖానలో ఒక ఆపరేషన్ థియేటర్, వార్డును ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలు అవసరమైనవారికి కొవిడ్ సోకిందని చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని స్పష్టంచేశారు. దీంతో అన్ని ప్రభుత్వ దవాఖానలు ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ సోకిన గర్భిణిలకు చికిత్స అందించేందుకు 50 పడకలు ఏర్పాటు చేశారు. ఇకడ ఇప్పటివరకు 29 మంది కొవిడ్ బాధిత గర్భిణులకు ప్రసవం చేశారు. ఇందులో 28 మందికి సాధారణ కాన్పులు కావడం విశేషం. ఐసీయూలో 10 పడకలు అందుబాటులో ఉన్నాయి.
సిద్దిపేటలోని జిల్లా దవాఖానలో కొవిడ్ బాధిత గర్భిణుల కోసం 25 పడకలు సిద్ధంచేశారు. సెకండ్ వేవ్ సమయంలోనే గర్భిణులు, ఇతర కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డులు, ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెచ్చారు. గర్భిణులకు సర్జరీ చేసేందుకు సెప్టిక్ ఆపరేషన్ థియేటర్ను ఆధునిక హంగులతో సిద్ధం చేశారు. హైదరాబాద్లోని కోఠి జిల్లా దవాఖానలో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక భవనాన్ని కేటాయించారు. ఇందులో గర్భిణుల కోసం ఒక అంతస్తును సిద్ధం చేసి 50 పడకలు అందుబాటులో ఉంచారు.
కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణికి మేడ్చల్ పట్టణంలోని పీహెచ్సీలో కాన్పు చేశారు. పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన సమ్రిన్ బేగంకు పురుటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. కాన్పు చేయడానికి ముందు రాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్యులు గాంధీ దవాఖానకు తరలించాలని సూచించారు. అయితే పురిటినొప్పులు ఎక్కువ కావటంతో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శైలజ ధైర్యం చేసి శ్రీరంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పురుడు పోశారు. సాధారణ ప్రసవం జరిగి, సమ్రిన్బేగం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ శైలజ తెలిపారు. సమ్రిన్ బేగంకు పురుడు పోయటంలో సీహెచ్వో మహలమ్మ, స్టాఫ్ నర్సులు పావని, రేవతి, ఏఎన్ఎం రజని, ఆశా కార్యకర్తలు రజిత, సువర్ణ ధైర్యం గా ముందుకొచ్చి సహకరించారని చెప్పారు.