బషీరాబాద్/నీలగిరి, మే 25 : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎస్సై రమేశ్కుమార్ కథనం ప్రకారం.. ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారి సూర్యప్రకాశ్తో కలిసి బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి వెళ్లగా అక్కడ ఇద్దరు వ్యక్తులు రెండు సంచులతో అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేస్తే, అందులో విడి పత్తి విత్తనాలు ఉన్నట్టు గుర్తించారు. వాటి గురించి విచారించగా దౌల్తాబాద్ మం డలం వీర్లపల్లికి చెందిన ఓ వ్యక్తి వద్దనుంచి తీసుకొని మండలంలోని ఎక్మాయి గ్రామంలో రైతులకు విక్రయించేందుకు తెచ్చినట్టు చెప్పారు. వారి నుంచి 4 క్వింటాళ్ల 15 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, విఠలప్ప, చిన్నగుంట రాములుపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
నల్లగొండ జిల్లాలో 280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు పాల్వాయి శ్రావణ్కుమార్ శనివారం తెలిపారు. రెండు రోజుల క్రితం మిర్యాలగూడలో 260 కిలోలు, శాలిగౌరారం మండలంలో 20 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్టు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.