హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): జూన్ 8లోగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని, ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో విస్తరించి ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని తెలిపింది. జూన్ 8లోగా తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది. కాగా, ఆదివారం రాష్ట్రంలో ఒక వైపు వానలు, మరో వైపు ఎండలు దంచి కొట్టాయి.
16 జిల్లాల్లో కురిసిన వర్షం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో16 జిల్లాల్లో వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. సిద్దిపేట జిల్లా రాంపూర్లో అత్యధికంగా 5.60 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా పొద్దటూర్లో 5.45, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగారంలో 4.40, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో 3.93, రుద్రారం (గీతం)లో 3.80 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు పేర్కొన్నది. సోమవారం ఉదయం వరకు సిద్దిపేట, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రంగారెడ్డి, నాగర్కర్నూల్, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
భానుడి భగభగలు
హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఆదివారం 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 45.2, చప్రాలలో 44.9, నిర్మల్ జిల్లా తానూరులో 44.8, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 45పైన, నిర్మల్, కుమ్రంభీం, పెద్దపల్లి జిల్లాల్లో 44 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ పేర్కొన్నది. సోమవారం అదనంగా మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.