SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంత్రాలకు 48 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. వేసవికాలం రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. సికింద్రాబాద్-నాగర్సోల్, నాగర్సోల్-సికింద్రాబాద్, తిరుపతి-మచిలీపట్నం, మచిలీపట్నం-తిరుపతి, సీఎస్టీ ముంబయి – కరీంనగర్, కరీంనగర్-ముంబయితో పాటు యశ్వంత్పూర్-కాలాబుర్గి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. సికింద్రాబాద్-నాగర్సోల్ (07517) ప్రత్యేక రైలు ఏప్రిల్ 17 నుంచి మే 29 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
నాగర్సోల్ – సికింద్రాబాద్ (07518) రైలు ఏప్రిల్ 18 నుంచి మే 30 వరకు ప్రతి గురువారం నడుస్తుందని చెప్పింది. తిరుపతి-మచిలీపట్నం (07121) రైలు ఈ నెల 14 నుంచి మే 26 వరకు ప్రతి ఆదివారం పరుగులు తీయనున్నది. మచిలీపట్నం-తిరుపతి (07122) రైలు ప్రతి సోమవారం ఈ నెల 15 నుంచి మే 27 మే వరకు నడుస్తుందని పేర్కొంది. సీఎస్టీ ముంబయి – కరీంనగర్ (01067) రైలు ఈ నెల 9 నుంచి మే 28 వరకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉందని చెప్పింది. కరీంనగర్-సీఎస్టీ ముంబయి (01068) రైలు ఈ నెల 10 నుంచి మే 29 వరకు పరుగులు తీయనున్నది. యశ్వంత్పూర్-కాలాబుర్గి (06505) రైలు ఈ నెల 8న, కాలాబుర్గి-యశ్వంత్పూర్ (06506) రైలు ఈ నెల 9న నడువనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.