Special Trains | తిరుపతి, షిర్డీ వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-షిర్డీ-తిరుపతి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. తిరుపతి-షిర్డీ సాయినగర్ (07637) రైలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 28 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ రైలు ప్రతి ఆదివారం వేకువ జామున 4గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. షిర్డీ సాయినగర్-తిరుపతి (07638) రైలు డిసెంబర్ ఒకటి నుంచి 29వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది.
ఈ రైలు ప్రతి సోమవారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరి బుధవారం వేకువ జామున 1.30గంటకు తిరుపతికి చేరుతుంది. చర్లపల్లి-తిరుపతి (07001) రైలు డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతిబుధవారం నడుస్తుందని తెలిపింది. ఈ రైలు రాత్రి 9.20 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుకుంటుందని పేర్కొంది. తిరుపతి-చర్లపల్లి (07002) రైలు డిసెంబర్ 4 నుంచి జనవరి 1 వరకు రైలు రాకపోకలు సాగిస్తుందని.. ఈ రైలు సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని వివరించింది.