SRC Special Trains | సంక్రాంతి నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లే ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా, రద్దీ కొనసాగుతుండడంతో తాజాగా మరో నాలుగు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. సికింద్రాబాద్-నర్సాపూర్, నర్సాపూర్ – సికింద్రాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్ – హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. సికింద్రాబాద్ – నర్సాపూర్ (07176) ప్రత్యేక ఈ నెల 13న రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.
మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. నర్సాపూర్ – హైదరాబాద్ (07177) స్పెషల్ ట్రైన్ ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. హైదరాబాద్-శ్రీకాకుళం (07178) ప్రత్యేక రైలు ఈ నెల 12న రాత్రి 9.10 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు 11.45 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. శ్రీకాకుళం రోడ్ – హైదరాబాద్ (07179) ప్రత్యేక రైలు 13న సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు నాంపల్లికి వస్తుంది.
సికింద్రాబాద్-నర్సాపూర్ (07176) రైలు జనగామ, కాజిపేట, వరంగల్, మహబుబాబాద్, ఖమ్మం, మధిర, రాయనపాడు, రామవరప్పాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నర్సాపూర్ – హైదరాబాద్ (07177) రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివాడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.
హైదరాబాద్-శ్రీకాకుళంరోడ్-హైదరాబాద్ (07178-07179) రైళ్లు సికింద్రాబాద్, జనగామ, కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయని వివరించింది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్లు ఉన్నాయని.. ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాకేశ్ కోరారు.