హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): త్వరలో దేశంలోనే ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాంగణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనున్నది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సంకల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వీటి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి అవాసంలో ఒక ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణం, పట్టణాల్లో ప్రతి వార్డుకు కనీసం ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. ఎకరం స్థలంలో ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ పిట్, ఎక్సర్సైజ్ బార్ను ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలో 19,472 తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. మొత్తం 13,418 ప్రాంతాల్లో అనువైన స్థలాలను గుర్తించారు. వీటిలో 10,451 గ్రామ పంచాయతీల్లో, 2,967 ఆవాసాల్లో ఉన్నాయి. ఇప్పటికే 5,299 టీకేపీల పనులు పూర్తి అయ్యాయి. 7,787 టీకేపీలు పనులు కొనసాగుతున్నాయి. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులు, యువతలో శారీరక ధారుఢ్యం పెంపొందించేందుకు క్రీడా ప్రాంగణాలు దోహద పడతాయని భావిస్తున్నారు.