హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ నెలాఖరులోగా రాష్ట్రంలోని ప్రతి పౌరునికి కరోనా టీకాలను వేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన బీఆర్కే భవన్లో బ్యాంకర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బందికి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించామన్నారు. వారంలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక మొత్తంలో వ్యాక్సిన్ డోసులను పొందేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎస్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సెల్బీసీ కన్వీనర్ కృష్ణశర్మ, ఏపీజీవీబీ చైర్మన్ ప్రవీణ్కుమార్, టీఎస్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్ డ్రైవ్లో 12 గ్రూపులకు టీకాలు
హై ఎక్స్పోజర్ ఉండే 12 గ్రూపులకు చెందిన వ్యక్తులకు టీకా వేస్తున్నామని సోమేశ్కుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జడ్పీపీ హైసూల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హై ఎక్స్పోజర్ క్యాటగిరీలో భాగంగా సెలూన్లు, కిరణాషాపుల్లో పనిచేస్తున్నవారికి, వీధి వ్యాపారులకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. వరర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడానికి పురపాలక శాఖ ప్రత్యేకంగా యాప్ను రూపొందించిందన్నారు. రిజిస్టర్ చేసుకొన్న తర్వాత వారి మొబైల్కు మెసేజ్ వస్తుందని, అలా మెసేజ్ వచ్చినవారిని మాత్రమే వ్యాక్సినేషన్కు అనుమతిస్తున్నామని చెప్పారు. రిజిస్టర్ చేసుకోకుండా నేరుగా వచ్చేవారికి టీకా ఇచ్చేది లేదని సీఎస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.