హైదరాబాద్, మార్చి18 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తరభాగం భూ సేకరణకు 8 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)తో పాటు భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు, మెదక్ జిల్లా నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు, సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి, అందోల్-జోగిపేట ఆర్డీవోలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవోలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్రోడ్డును ప్రతిపాదించగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరభాగంలో కంది నుంచి గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. భూసేకరణ ఖర్చులో 50 శాతం భరిస్తామని కేంద్రానికి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల సంస్థ గెజిట్ విడుదల చేయగానే భూ సేకరణ పనులు
చేపట్టనున్నారు.