హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమితులైన సోమా భరత్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేడు రూ. 700 కోట్ల టర్నోవర్కు చేరుకుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాదరణ ఉందని, కానీ నాడు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాలేదని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నూతనంగా ఔట్ లెట్లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంకా మరిన్ని ఔట్ లెట్లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విజయ పేరుతో డెయిరీలో నూతనంగా అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం జరిగిందన్నారు. పాడి రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మంత్రి వివరించారు. విజయ డెయిరీ అభివృద్ధి చర్యలలో భాగంగా రూ. 250 కోట్ల వ్యయంతో మెగా డెయిరీ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.