హైదరాబాద్, జులై 7(నమస్తే తెలంగాణ): సీఎమ్మార్ సమస్యను పరిష్కరించి, మిల్లింగ్ పరిశ్రమను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మిల్లర్లు విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వం సీఎమ్మార్ను నిరాకరించడం, మిల్లుల్లో ఇబ్బందులు ఇతర అంశాలపై గురువారం హైదరాబాద్లో మిల్లర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిల్లర్స్ అసోసియేషన్ పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. సీఎమ్మార్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ 13న అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్టు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేందర్, మోహన్రెడ్డి తెలిపారు. నెల రోజులుగా మిల్లులు మూతపడటంతో లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నదన్నారు. కలెక్టర్లకు వినతిపత్రాల అనంతరం కేంద్రం స్పందించకుంటే ఢిల్లీకి వెళ్లాలని మిల్లర్లు నిర్ణయించారు.
కేంద్రం స్పందిస్తుందని ఆశిస్తున్నాం: మంత్రి గంగుల
సీఎమ్మార్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫును కృషి చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తనను కలిసిన మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే అనేకమార్లు తమ అధికారులు ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తిచేశారని, తాము కూడా కేంద్రంతో నిరంతరం చర్చిస్తూనే ఉన్నామని చెప్పారు. రైతులతో ముడిపడిన సమస్య కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మిల్లర్ల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.