హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బీసీ గురుకులాలు పని చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన వర్గాల సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు మీటింగ్ శుక్రవారం మంత్రి గంగుల అధ్యక్షతన తన కార్యాలయంలో జరిగింది.
బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు ఇతర డైరెక్టర్లు హాజరైన ఈ కార్యక్రమంలో 2022 -23 సంవత్సరానికి సంబంధించిన ముఖ్య అంశాలను ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి సంక్షేమం కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు.
గతంలో దాదాపు 16 గురుకులాల ద్వారా కొద్ది మందికి మాత్రమే విద్యను అందించారు. కానీ సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ఏర్పాటు తర్వాత నేడు 281 బీసీ గురుకులాల్లో వేలాదిమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.
ముఖ్యంగా విద్యార్థులకు వేడినీటితో స్నానం చేసే అవకాశాలు కల్పించడం కోసం టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ప్రతి గురుకులంలో సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల చేసిన ప్రతిపాదనకు అందరూ ముక్త కంఠంతో ఆమోదించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ క్లాస్ రూం, ఈ లెర్నింగ్ క్లాస్ రూంలను ఈ సంవత్సరానికి 1696 గురుకులాల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
అలాగే గురుకులాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అకడమిక్ సెల్, ఇంటర్నల్ ఆడిట్ టీంలను మరింత బలపర్చడమే కాకుండా, హైజీనిక్, బిల్డింగ్ అప్పియరెన్స్, ఫుడ్ క్వాలిటీ అస్యూరెన్స్ తదితర కమిటీల ద్వారా అన్ని అంశాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానించింది.
కార్యక్రమంలో టీఎస్ రెడ్కో చైర్మన్ జానయ్యతో పాటు బోర్డు సభ్యులు గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు, ఈడబ్లూఐడీసీ ఎండీ పార్థసారథి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డీఎస్ రూపారాణి, డైరెక్టర్ ఎస్సీఈఆర్టీ రాధారెడ్డి, సెక్రటరీ టీఆర్ఈఐఎస్ రమణ కుమార్, స్కూల్ ఎడ్యుకేషన్ జేడీ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.