ఆదిలాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. తాజాగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది. పల్లెప్రగతిలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లో తయారు చేసిన సేంద్రియ ఎరువులతో పంచాయతీకి రూ.7 లక్షల ఆదాయం రాగా ఈ డబ్బులను ఇతర పనులకు వెచ్చించాలని పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది.
విద్యుత్తు వినియోగంలో భాగంగా పంచాయతీకి ప్రతి నెలా రూ.10 వేల కరెంటు బిల్లు వస్తున్నది. సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటుతో విద్యుత్తు బిల్లు మిగులుతుందనే ఆలోచనతో రూ.4 లక్షలు వెచ్చించి గ్రామంలో సోలార్ విద్యుత్తు తయారీని చేపట్టారు. రెండేండ్ల వరకు గ్రిడ్ల నిర్వహణ కంపెనీవారు చూసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు గ్రిడ్లు ఏర్పాటు చేయగా, రోజుకు 6 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి అవుతున్నది. ఈ విద్యుత్తును గ్రామంలోని వీధి దీపాలు, వాటర్ప్లాంట్, పాఠశాల, అంగన్వాడీ, పంచాయతీ భవనాలకు వినియోగిస్తున్నారు. ఇందుకుగాను రోజూ 4 కిలోవాట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా, 2 కిలోవాట్లు మిగులుతున్నది. దీన్ని ట్రాన్స్కోకు ఇచ్చే లా ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ విద్యుత్తు వాడకంతో పంచాయతీకి కరెంటు బిల్లు ఖర్చు మిగులుతున్నదని పాలకవర్గ సభ్యులు చెప్తున్నారు.