రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
హైదరాబాద్, మార్చి10(నమస్తే తెలంగాణ): ప్రైవేటు విద్యాసంస్థలలోని బోధనా సిబ్బందికి సాంఘిక భద్రత అవసరమని, ఈ మేరకు పార్లమెంటులో చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ తెలిపారు. ప్రైవేటురంగంలో బోధనా సిబ్బంది అభత్రతాభావంతో విధులు నిర్వహిస్తున్నారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీచింగ్ సెస్ నిధులు సేకరించేలా చట్టంలో ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ సెస్ నుంచి నిధులతో వారి కుటుంబసభ్యులను ఆదుకొనే వీలు ఉంటుందన్నారు. భవన నిర్మాణరంగంలో ని కార్మికులకు ఈ తరహా విధానం అమలవుతున్నదని గుర్తుచేశారు. ప్రైవేటు విద్యా రంగంలో పనిచేస్తున్న లక్షలమంది బోధనా సిబ్బందికి ఈ చట్టం ద్వారా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.