హైదరాబాద్ : మానవ సేవే మాధవ సేవా అనే దృక్పథంతో ప్రతి ఒక్కరూ కృషి చేసి సమాజంలో సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం ఊబంతు ట్రస్ట్, వెబ్సైట్ను జస్టిస్ చంద్రయ్య, రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఊబంతు ట్రస్ట్ చైర్పర్సన్, మేనేజింగ్ ట్రస్టీ చిరంజీవులతో కలిసి ప్రారంభించారు. చాలా మంది రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్డ్ కాగానే, విశ్రాంతి తీసుకుంటారని కానీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అందుకు భిన్నంగా సామాజిక సేవా దృక్పథంతో ఊబంతు ట్రస్ట్ను ప్రారంభించి నిరుపేదల సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయడం అభినందనీయమైన విషయమన్నారు. ఊబంతు ట్రస్ట్ లక్ష్యాలు, ఆశయాలు ఎంతో ఉన్నతంగా ప్రశంసించారు.
ఉచిత శిక్షణ అభినందనీయం : వినోద్కుమార్
భవిష్యత్లో ట్రస్ట్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు విద్యార్థులకు, నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. సామాజిక దృక్పథంతో ఊబంతు ట్రస్ట్ ప్రారంభించి విద్యార్థులు ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరు కావడానికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్ల కాలంలో అన్ని వర్గాల సంక్షేమానికి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో రాష్ట్రంలో దాదాపు ఒక కోటి ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, రైతుబీమా పథకాలతో రైతుల జీవితాలలో వెలుగులు నింపాయని ఆయన అన్నారు.
600 మంది యువతీ యువకులకు ఉచిత శిక్షణ : చిరంజీవులు
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు తెలివి తేటలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షలపై ఆశించిన మేర అవగాహన, శిక్షణ లేకపోవడంతో ఎక్కువ మంది ఎంపిక కాలేక పోతున్నరని ఊబంతు ట్రస్ట్ చైర్పర్సన్, మేనేజింగ్ ట్రస్టీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. అందులో భాగంగా ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఊబంతు ట్రస్ట్ ద్వారా నిష్టనులైన విద్యావంతులతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని నిరుద్యోగ విద్యార్థులకు ఆరు కేంద్రాల్లో ఆయా జిల్లాలకు చెందిన 600 మంది యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ తెలంగాణ పబ్లిక్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఉద్యోగాల ఎంపికకు నిర్వహించనున్న వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
తమ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సెమి రెసిడెన్షియల్, ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా భూమి, ఇండ్ల స్థలాలు, ఆస్తి రిజిస్ట్రేషన్పై అవసరమైన వారికి ఆయా రంగాల్లో అనుభవం ఉన్న వారిచే ఉచితంగా సహాయ సలహాలు అందజేస్తామని ఆయన తెలిపారు. రిటైర్డ్ మెంట్ అనేది ఉద్యోగానికని ఆయన అన్నారు. సామాజిక కార్యక్రమాలు వయస్సుతో నిమిత్తం లేకుండా నిర్వహించాలనేది తన సంకల్పం అని అన్నారు.
ఊబంతు ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ మిషన్, కేంద్ర ప్రభుత్వ రిక్రూట్ మెంట్ బోర్డులు నిర్వహించి ఉద్యోగ పోటి పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయమైన విషయం అని రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. కార్యక్రమానికి దైవజ్ఞ శర్మ అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో ఈవీకే ఫౌండేషన్ చైర్మన్ లయన్ విజయ్ కుమార్, లోకయుక్త ఎస్పీ వెంకట్రావు, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి గౌరి శంకర్, ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్ జనరల్ మేనేజర్ ప్రసాద్, బీ రాజమౌళి తదితరులు ప్రసంగించారు. అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 16 మంది సాంస్కృతిక ఉపాధ్యాయులకు గురుపూజ మహోత్సవ పురస్కారాలను అతిథులు అందజేశారు.