హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎస్సై పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష సాఫీగా ముగిసింది. పరీక్షకు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి 503 కేంద్రాలు, వీటికి అదనంగా మరో 35 పట్టణాల్లోనూ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తం 554 పోస్టులకుగాను 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా, 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరుశాతం 91.32గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్ అటెండెన్స్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, డిజిటల్ ఫొటోగ్రాప్స్ సేకరించారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన కీని www.tslprb.in వెబ్సైట్లో ఉంచినట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస్రావు తెలిపారు.
ప్రిపేరైనవారు అర్హత సాధించే అవకాశం
ఎస్సై ప్రిలిమ్స్లో ప్రశ్నలు సులభంగా ఉన్నాయని, ఆసక్తితో ప్రిపేరైన వారు తప్పకుండా అర్హత సాధిస్తారని పలువురు అభ్యర్థులు తెలిపారు. సిలబస్ నుంచే ప్రశ్నలు వచ్చాయని, ప్రశ్నల్లో ఎలాంటి తప్పులు లేవని పేర్కొన్నారు.