హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మంగళవారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో విడుదలచేశారు. ఫస్టియర్లో 67.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులవగా, సెకండియర్లో 47.74 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ మార్కుల పట్ల సంతృప్తిగా లేని విద్యార్థులు సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని జలీల్ తెలిపారు. ఒక్కో పేపర్కు రీకౌంటింగ్కు రూ.100, రీవెరిఫికేషన్కు రూ.600 ఫీజుగా చెల్లించాలని చెప్పారు. కార్యక్రమంలో ఇంటర్ పరీక్షల విభాగం కంట్రోలర్ అబ్దుల్ ఖాలిక్, ఓఎస్డీ సుశీల్కుమార్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులకు జారీచేసిన మెమోలతో డిగ్రీ, ఎంసెట్ ప్రవేశాలు పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఎంసెట్ వెబ్కౌన్సెలింగ్లో మార్పులు
ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో అధికారులు స్పల్ప మార్పులు చేశారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ గడువును సెప్టెంబర్ ఒకటి వరకు పొడిగించారు. ధ్రువపత్రాల పరిశీలనకు సెప్టెంబర్ 2 వరకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్ల గడువును 3వ తేదీ వరకు పెంచినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ వెల్లడించారు.