గంభీరావుపేట, జనవరి 24: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని ‘కేజీ టు పీజీ’ క్యాంపస్లో మంగళవారం బ్యాంక్ ఆఫ్ అమెరికా వారు స్కిల్ సెంటర్ను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ సహకారం, గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా, టీ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ వారు డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు మూడు నెలలపాటు వర్చువల్ శిక్షణ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్కిల్ సెంటర్ లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్పై ఉచితంగా శిక్షణ అందిస్తారు. మంగళవారం నుంచే తరగతులు ప్రారంభించారు.
స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు ఇంగ్లిష్లో ఎలా మాట్లాడాలి? ఏవిధంగా ప్రతిభను చాటాలి? ఉన్నత విద్యకు పరీక్ష ఎలా రాయలి? ఉద్యోగావకాశాలను పొందాలంటే ఏం చేయాలి? ఇలా పలు అంశాలపై అర్థమయ్యేలా వివరించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా వారు గంభీరావుపేట క్యాంపస్లో స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా అందిస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ దాసు కోరారు.