హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.64 కోట్లు కాజేసిన ముఠా మరో రూ.20 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ సిద్ధం చేసుకున్నట్టు వెల్లడైంది. అకాడమీకి, బ్యాంకులకు మధ్య రాజ్కుమార్ దళారీగా వ్యవహారించాడు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ, శ్రీనివాస్, సోమశేఖర్తో కలిసి రాజ్కుమార్ ఒక ముఠా ఏర్పాటుచేసి అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్లను కొల్లగొట్టడంమే లక్ష్యంగా గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పనిచేసినట్టు దర్యాప్తులో బయటపడింది. గతనెల 14వ తేదీన సుప్రీంకోర్టు రెండు తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన ఆస్తుల పంపిణీకి సంబంధించిన తీర్పు వెలువరించడంతో అకాడమీ అధికారులు బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దుచేయాలని నిర్ణయం తీసుకోగా రూ.64 కోట్లు కాజేసిన సంగతి తెలిసింది. ఒకవేళ సుప్రీంకోర్టు నిర్ణయం రాకుంటే మరిన్ని బ్యాంకులలోని డిపాజిట్లను ఈ ముఠా ఖాళీ చేసి ఉండేదని పోలీసులు అనుమానిస్తున్నారు.
రాజ్కుమార్ ముఠాకు అకాడమీలో సహకరించింది ఎవరనేది తెలుసుకునేందుకు మాజీ డైరెక్టర్ సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ విభాగం అధికారులు, సిబ్బంది వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరో కీలక నిందితుడు పట్టుబడితే, అకాడమీ అధికారులకు ఉన్న లింక్లు బయటపడే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.