జవహర్నగర్, నవంబర్ 5: ఈత సరదా ఆరుగురి ప్రాణాలను బలితీసుకొన్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో పడి ఐదుగురు విద్యార్థులతోపాటు వారిని రక్షించేందుకు ప్రయత్నించిన ఒక ఉపాధ్యాయుడు కూడా మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కారం ప్రాంతానికి చెందిన రెహ్మాన్ తన నూతన గృహ ప్రవేశం ఫంక్షన్కు అంబర్పేటలోని హనీషా మదర్సాకు చెందిన విద్యార్థులను ఆహ్వానించారు. శనివారం మదర్సా ఉపాధ్యాయులతో పాటు 40 మంది విద్యార్థులు ఫంక్షన్కు హాజరయ్యారు. అప్పటివరకు ఆనందంగా గడిపిన విద్యార్థులు సమీపంలోనే ఉన్న ఎర్రగుంట చెరువు వద్దకు వెళ్లారు.
ఈత కొట్టేందుకు ఐదుగురు చిన్నారులు చెరువులోకి దిగారు. లోతు తెలియక నీటిలో మునిగిపోయారు. ఇది గమనించిన ఉపాధ్యాయుడు యోహాన్ వారిని రక్షించేందుకు వెళ్లారు. విద్యార్థులు అతడిని పట్టుకోవడంతో ఈత రాక ఆయన కూడా నీటమునిగారు. ఈ ప్రమాదంలో విద్యార్థులు ఇస్మాయిల్(11), జాఫర్(10), సోహెల్(9), అయాన్(9), రియాన్(12), ఉపాధ్యాయుడు యోహాన్(25) అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన స్థలానికి కుషాయిగూడ ఏసీపీ సాధన రష్మి పెరుమాళ్, సీఐ కే చంద్రశేఖర్, ఎస్సైలు, పోలీసులు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భోజనాలకు ముందే విషాదం
నూతన గృహంలో ప్రార్థనలు ముగిసిన అనంతరం భోజన ఏర్పాట్లు చేశారు. భోజనాలు ప్రారంభం కావడానికి ముందే విద్యార్థులు ఈతకు వెళ్లి మృతిచెందిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితులు మృతి చెందడంతో మిగిలిన విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధతో తల్లడిల్లుతున్న విద్యార్థులను స్థానికులు గుండెలకు హత్తుకొని ఓదార్చారు.