నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డిలను ఈడీ కస్టడికీ ఇవ్వొద్దని సిట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణయ్య గురువారం 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును విన్నవించారు. పేపర్ లీకేజీ కేసును అన్ని కోణాల్లో, పూర్తి స్థాయిలో సిట్ విచారణ చేస్తోందని, ఇప్పటికే హైకోర్టుకు కూడా దర్యాప్తులో వెల్లడైన అంశాలతో స్టేటస్ రిపోర్టును అందించినట్టు తెలిపారు. ఈడీ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం అప్రస్తుతమని వివరణ ఇచ్చారు. అయినా ప్రధాన నిందితులను ఈడీ కస్టడికీ అప్పగించాలని కోరుతూ ఈడీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్మోహన్ కోర్టు ముందు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఇరు పక్షాల వాదనలను విన్న మేజిస్ట్రేట్ వీ ఈశ్వరయ్య కస్టడీ విషయంపై గురువారం ఎలాంటి తీర్పు వెల్లడించలేదు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్ష పత్రాన్ని కొనుగోలు చేసిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల కస్టడీని సిట్ కోరగా, గురువారం మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
బెయిల్ పిటిషన్లపై వాదనలు
లీకేజీ కేసులో నిందితులు దామెర రమేశ్కుమార్ (ఏ12), తిరుపతయ్య (ఏ15) వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా, న్యాయవాదులు వాదనలు వినిపించారు. సిట్ దాఖలు చేసిన కౌంటర్లో అవాస్తవాలున్నాయని నిందితుల తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టినా, ఇంకా విచారణ పూర్తి కాలేదంటూ సిట్ కౌంటర్ దాఖలు చేయడం విచారకరమని, తమ క్లయింట్లకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. వారి వాదనలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకమైందనే విషయం తెలుసుకోవాల్సిన అవసరముందని, సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని పీపీ న్యాయస్థానం దృష్టికి తీసికెళ్లారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.