హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బొగ్గుకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. రానున్న ఐదేండ్లల్లో 10 కొత్త ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించింది. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు, సలహాదారులతో సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి, ఈ ఏడాది వివిధ ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించే పెద్ద ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించారు. వచ్చే ఐదేండ్లల్లో ప్రారంభించాల్సిన ఇతర ప్రాజెక్టులపైనా చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒడిశాలోని నైనీ కోల్బ్లాక్ నుంచి 25 లక్షలు, కొత్తగూడెంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వీకే కోల్మైన్ నుంచి 15 లక్షలు, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓపెన్ కాస్ట్ (ఓసీ) గని నుంచి 5 లక్షల టన్నులు, ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీ ఉంచి 10 లక్షల టన్నుల బొగ్గు వెలికితీతకు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ పది ప్రాజెక్టుల్లో మొత్తం 332 లక్షల టన్నుల బొగ్గు అందుబాటులో ఉన్నదని, వీటిలో ఉత్పత్తి ప్రారంభమైతే సింగరేణి సంస్థ 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి, రూ.50 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యాలను చేరుకొంటుందని తెలిపారు. సమావేశంలో సింగరేణి అధికారులు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరామ్, డీ సత్యనారాయణరావు, డీఎన్ ప్రసాద్, సురేంద్ర పాండే, జే అల్విన్, కే సూర్యనారాయణ, కే నాగభూషణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.