హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి మరో రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు చరిత్రలో ఏ నెలలోనూ సాధించని విధంగా 2022 డిసెంబర్లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసింది. మొత్తం 67.3 లక్షల టన్నుల బొగ్గును వెలికితీసింది. ఇది నిరుడు డిసెంబర్తో పోల్చుకుంటే.. సుమారు 19 శాతం అధికం. దీంతోపాటు ఆ నెలలో రికార్డుస్థాయిలో సగటున రోజుకు 2.18 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి మంగళవారం సింగరేణి అన్ని ఏరియాల జీఎంలు, డైరెక్టర్లతో సీఎండీ ఎన్ శ్రీధర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదే ఒరవడితో మిగిలిన మూడు నెలల్లో లక్ష్యాలను అందుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. 2021 డిసెంబర్లో 56.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగ్గా.. 2022 డిసెంబర్లో 19 శాతం వృద్ధితో 67.3 లక్షల టన్నులకు చేరామని చెప్పారు. ఓబీ తొలగింపులోనూ 24.47 శాతం వృద్ధితో 47 మిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుకున్నామని వివరించారు. ఇలాగే ముందుకుసాగితే రూ. 34 వేల కోట్లకుపైగా టర్నోవర్, అత్యధిక లాభాలు సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ నెల ప్రగతిపై హర్షం ప్రకటించారు. కార్మికులు, అధికారులను అభినందించారు. సమావేశంలో డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు, ఈడీ అల్విన్, అడ్వైజర్లు డీఎన్ ప్రసాద్, సురేంద్రపాండే, జీఎంలు సురేశ్, సీహెచ్ నర్సింహారావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.