హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేమని, మరికొంత గడువు కావాలని సింగరేణి సంస్థ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వరుసగా పండగలు రావడం, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉండటం తదితర కారణాల రీత్యా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేమని తెలిపింది.
సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారని తెలియజేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఈ ఏడాది అక్టోబర్ వరకు హైకోర్టు గడువు ఇచ్చింది. ఆ గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరింత గడువు కావాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ విజయ్సేన్రెడ్డి గురువారం విచారణ జరిపారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.