హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధక, వ్యవసాయశాఖల మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన మంత్రి మసబ్ట్యాంక్లోని పశుసంవర్ధక డైరెక్టరేట్లోని కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అదర్ సిన్హా, ఆ శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, విజయ డెయిరీ జీఎం కామేశ్, మత్స్య శాఖ జేడీ మురళీకృష్ణతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై మంత్రి తలసాని ఆయనకు వివరించారు.
జీవాల పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా వంద సంచార పశువైద్య వాహనాలను ప్రారంభించి, జీవాల వద్దకే వెళ్లి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. అవి వ్యాధుల భారిన పడకుండా వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (VBRI) ఆధ్వర్యంలో ఆరు రకాల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవసరాలు తీరిన అనంతరం మిగతా వాటిని ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు ఆర్థికాభివృద్ధి ఎంతో దోహదపడ్డాయని వివరించారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలను ఉద్దేశంతో గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభించామని, అనతికాలంలో ఆశించిన ఫలితాలు లభించాయన్నారు. వ్యవసాయం తర్వాతి స్థానంలో నిలిచే పాడిరంగం అభివృద్ధి, పాడి రైతులను ప్రోత్సహించేందుకు పథకాలు ప్రభుత్వం రూపొందించి, అమలు చేస్తుందన్నారు.
ప్రభుత్వరంగంలోని విజయ డెయిరీ పాలు సరఫరా చేసే రైతులకు లీటరు పాలకు అదనంగా రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా 2.93లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, ఇప్పటి వరకు రూ.343కోట్లు రైతులకు చెల్లించామన్నారు. కార్యక్రమం తర్వాత డెయిరీకి 1.27లక్షల లీటర్ల నుంచి 3.97లక్షల లీటర్లకు పెరిగిందన్నారు. పాలు, వివిధ రకాల పాల పదార్ధాలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నట్లు చెప్పారు. మేలుజాతి పశుసంపద ను అభివృద్ధి చేయడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం కరీంనగర్లో పశువీర్య ఉత్పత్తి కేంద్రం, నాణ్యత పరీక్షల కోసం ఒక ల్యాబ్ను ప్రారంభించినట్లు తెలిపారు.
కంసానిపల్లిలో మరో కేంద్రం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయన్నారు. అదేవిధంగా మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు, మంచినీటి రిజర్వాయర్లలో రొయ్య పిల్లల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మత్స్యకారులు చేపలు విక్రయించుకోవడానికి సబ్సిడీ పై వాహనాలు, చేపలు, చేపల వంటకాల విక్రయాల కోసం మొబైల్ రిటైల్ ఫిష్ ఔట్ లెట్ లను సబ్సిడీపై అందజేసిన విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోక్నాథ్ మాట్లాడుతూ పాడి, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అద్భుతంగా ఉందన్నారు. సిక్కింలోనూ పథకాలు అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని, ఈ మేరకు సహకారం అందించాలని కోరారు. త్వరలోనే తెలంగాణలో సిక్కిం అధికారులు పర్యటిస్తారని తెలుపగా.. మంత్రి శ్రీనివాస్ యాదవ్ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.