లింగాలఘనపురం, డిసెంబర్ 18: ప్రాచీన కాలంలో ఆచరించిన సంప్రదాయాల్లో కొన్ని భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయనే దానికి జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం వనపర్తిలో వెలుగుచూసిన సతీశిల నిదర్శనం. సతీసహగమనం కొనసాగే రోజుల్లో భర్త చనిపోతే భార్య ప్రాణత్యాగం చేసేవారు. వారి త్యాగాలకు ప్రతీకగా ఆయా రాజులు త్యాగధనుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తే, ప్రజలు వీరగల్లులు(దేవతలు)గా పూజించే వారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లు వనపర్తి గ్రామంలో ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు రత్నాకర్రెడ్డి వివరించారు. త్యాగాలకు గుర్తుగా సతీ శిలను కాకతీయులు వీరగల్లులుగా ప్రతిష్ఠించగా, గ్రామదేవతలతో సమానంగా ప్రజలు పూజించేవారు. ఇందుకు నిదర్శనంగా కాకతీయుల శైలిలో వనపర్తిలో శివాలయం, నంది, శివలింగం ఉన్నట్టు ఆయన చెప్పారు. ఆలయం ఎదుట రెండు అంతస్తుల మండపం, చెరువు, దాని సమీపంలో సతీ శిలలు దర్శనమిచ్చినట్టు రత్నాకర్రెడ్డి పేర్కొన్నారు.