హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): సికిల్ సెల్ ఎనీమియా.. ఒక రకమైన రక్తహీనత. ఈ వ్యాధి ఉన్నవారు సకాలంలో జాగ్రత్తలు తీసుకోపోతే చిన్న వయస్సులోనే చనిపోతారు. దీని తీవ్రతను గుర్తించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. ఈ వ్యాధిపై అవగాహన కల్పిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ వ్యాధిపై అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించేందుకు పాఠ్యాంశాలు, కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ మేరకు యూజీసీ సెక్రటరీ మనీశ్జోషి మంగళవారం అన్ని యూనివర్సిటీల వైస్చాన్స్లర్లు, అన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు లేఖ రాశారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) సూచలను అనుసరించి ఆయన లేఖను రాశారు. సికిల్ సెల్ లోపం వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది. దేశంలో ఏటా 30 నుంచి 40 వేల మంది పిల్లలు ఈ రుగ్మతతో జన్మిస్తున్నారని అంచనాలున్నాయి. ఐసీఎంఆర్ సూచనల ప్రకారం తగినంత అవగాహన, కౌన్సిలింగ్, నిర్దిష్ట చికిత్సతో ఈ లక్షణాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఈ నేపథ్యంలోనే వ్యాధికి గల కారణాలు, చికిత్స, పరీక్షావిధానం, నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగానే తాజా ఆదేశాలిచ్చారు.