మలక్పేట, మే 24: ఆమె ఒంటరి మహిళ. నర్సు ఉద్యోగం. బాగా డబ్బులున్నాయి. దవాఖానలో ఆమెను పరిచయం చేసుకున్నాడు. స్నేహం చేసి శారీరకంగా మరింత దగ్గరయ్యాడు. అవసరానికి ఆమె నుంచి రూ.7 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని నిలదీయగా.. ఆమెను దారుణంగా చంపేశాడు. ఎంత దారుణంగా అంటే.. ఛాతిలో, పొట్టలో కిరాతకంగా పొడిచాడు. చనిపోయిన తర్వాత ఆమె శరీరాన్ని కట్టర్ మిషన్తో ఆరు ముక్కలు చేశాడు. తలను వేరుచేసి నల్లటి పాలిథిన్ కవర్లో పెట్టాడు.
వాటిని దాచిపెట్టే మార్గాలను గూగుల్లో నిందితుడు అన్వేషించాడు. 10 రోజులకుపైగానే శరీరభాగాలను ఇంట్లో దాచిపెట్టాడు. రాత్రివేళ తలను తీసుకెళ్లి మూసీ ఒడ్డున పెట్టాడు. మిగతా శరీర భాగాలను డీప్ఫ్రిజ్లో దాచాడు. వాసన రాకుండా కర్పూరం, అగరు వత్తీలు వెలిగించాడు. పినాయిల్తో కడిగాడు. ఆమె బతికే ఉన్నదని నమ్మించేందుకు తెలిసిన వాళ్లకు మెస్సేజ్లు పంపాడు. ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య తరహాలోనే నర్సును అతడు దారుణంగా చంపాడు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆరు రోజులు దర్యాప్తు జరిపి సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసును ఛేదించారు. ఈ కేసు వివరాలను బుధవారం మలక్పేట పోలీస్స్టేషన్లో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ రూపేశ్ మీడియాకు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం..
హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్డుకు చెందిన ఎర్రం అనురాధరెడ్డి (55) వృత్తి రీత్యా హెడ్నర్సు. వివాహమైన ఏడాదిన్నరకే భర్త చనిపోవటంతో కన్న కూతురును తన సొంత అక్కకు దత్తత ఇచ్చింది. 15 ఏండ్ల క్రితం నాంపల్లిలోని కేర్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్న సమయంలో, తన తండ్రి సర్జరీ కోసం వచ్చిన చైతన్యపురి కాలనీకి చెందిన స్టాక్ మార్కెట్ ట్రేడర్ బీ చంద్రమోహన్(48)కు అనురాధరెడ్డి పరిచయమైంది. భర్త చనిపోవటంతో ఒంటరిగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకున్న చంద్రమోహన్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ను ఆమెకు అద్దెకు ఇచ్చాడు. వడ్డీ వ్యాపారం చేసే అనురాధకు కాలనీవాసులను పరిచయంచేసి అప్పులు ఇప్పించటంలో చంద్రమోహన్ సహకరించాడు. 2018 నుంచి అనురాధ వద్ద చంద్రమోహన్ రూ.7 లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వటంలేదు. అనురాధ అతనిపై ఒత్తిడి పెంచి అసభ్యంగా మాట్లాడటంతో ఆమె ప్రవర్తనతో చంద్రమోహన్ విసిగిపోయాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉండాలంటే ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు.
ఈ నెల 12న మధ్యాహ్నం తర్వాత అనురాధతో ఉద్దేశపూర్వకంగా చంద్రమోహన్ గొడవపడ్డాడు. ఆమెను అతి కిరాతంగా కత్తితో ఛాతి, పొట్టలో పొడవగా అక్కడికక్కడే మృతిచెందింది. రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు చిన్న స్టోన్ కటింగ్ మెషిన్లను చంద్రమోహన్ కొనుగోలు చేశాడు. మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికివేశాడు. తలను నల్లని పాలిథిన్ కవర్లలో భద్రపరిచాడు. రెండు చేతులను, కాళ్లను మొండెం నుంచి వేరుచేసి, కాళ్లు చేతులను ఫ్రిజ్లో పెట్టాడు. సూట్కేస్లో మొండాన్ని దాచాడు. విషయం ఎవరికీ తెలియకుండా అనురాధ ఫోన్తో తెలిసిన వాళ్లకు మెస్సేజ్లు పంపుతూ ఆమె బతికే ఉన్నట్టు నటించాడు. శరీర అవయవాల వాసన రాకుండానిత్యం కర్పూరం, పర్ఫ్యూమ్లు, చల్లుతూ అగరు వత్తీలు వెలిగిస్తూ, పినాయిల్తో శుభ్రం చేశాడు. ఈ నెల15న చంద్రమోహన్ తలను ఆటోలో తెచ్చి తీగలగూడలోని అఫ్జల్నగర్ కమ్యూనిటీ హాల్ ఎదురుగా మూసీ బెడ్ పక్కన పడేసి వెళ్లాడు. ఈ నెల 17న ఉదయం కవర్లో మహిళ తలను గమనించిన పారిశుద్ధ్య సిబ్బంది 100కు సమాచారం అందించారు. మలక్పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని తలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతురాలిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని 735 పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు సేకరించి మృతురాలితో పోల్చిచూశారు. ఈ నెల 10 నుంచి 17 తేదీ వరకు తల దొరికిన తీగలగూడ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడిన వ్యక్తిని గుర్తించారు. పోలీసులు, అతడు వెళ్లిన దారి వెంట ఉన్న అన్ని సీసీ ఫుటేజీలను, అతడు చేరుకున్న ఇంటివరకు సీసీ ఫుటేజీలను గుర్తించి చంద్రమోహన్ను
పట్టుకున్నాడు.