హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయ్యి ఆరేండ్లుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించని పార్టీలను రిజిస్టర్ పార్టీల జాబితా నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నది. ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు ఈ 13 పార్టీలకు నోటీసులు ఇవ్వాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.
పార్టీల పేరుతో దినపత్రికల్లో ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతోపాటు సంబంధింత పార్టీని జాబితా నుంచి తొలగించాలా? వద్దా ?అనే దానిపై స్పష్టమైన సిఫార్సులతో కూడిన ప్రతిపాదనలను ఈ నెల 10లోగా సమర్పించాలని ఆదేశించింది. జిల్లా అధికారుల నుంచి వచ్చే నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు.
1. తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ
2. ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ
3. జాగో పార్టీ
4. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్
5. తెలంగాణ లోక్సత్తా పార్టీ
6. తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం
7. యువ పార్టీ
8. బహుజన్ సమాజ్ పార్టీ(అంబేదర్-ఫూలే)
9. తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ
11. జాతీయ మహిళా పార్టీ
12. యువ తెలంగాణ పార్టీ
13. తెలంగాణ ప్రజా సమితి(కిశోర్, రావు, కిషన్)