హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటు ఉభయసభల్లో నినదిస్తున్న టీఆర్ఎస్ ఎంపీలతో వివిధ రాష్ర్టాలు గొంతు కలుపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనకపోతే మిగులు బియ్యాన్ని బంగాళాఖాతంలో పారబోయాలా? అని రాజ్యసభలో బిజూ జనతాదళ్ (బీజేడీ) పక్ష నేత ప్రసన్నాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పుడు బియ్యం కొంటామని రెండు నెలల క్రితమే హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు ఒక్క గింజ కూడా కొనబోమని చెప్తున్నదని మండిపడ్డారు. రాజ్యసభ జీరో అవర్లో శుక్రవారం ఆయన బియ్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. ఉప్పుడు బియ్యం సేకరణ అంశం తెలంగాణ ప్రభుత్వం సృష్టిస్తున్న సమస్యగా కేంద్రం వక్రీకరించడాన్ని తప్పుబట్టారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఇదే విషయాన్ని ఛత్తీస్గఢ్ పౌరసరఫరాలశాఖ మంత్రి అమర్జీత్ భగత్ కూడా వెల్లడించారని గుర్తుచేశారు. తెలంగాణ మాదిరిగా ఒడిశా కూడా అధికంగా వరి పండించే, వడ్లు సేకరించే రాష్ట్రమని వివరించారు. ఒడిశా, తెలంగాణ ప్రజలు ఏండ్ల తరబడి ఉప్పుడు బియ్యం ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది ఒడిశాలో దాదాపు 28 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మిగిలినట్టు వెల్లడించారు. ఒడిశా, తెలంగాణ నుంచి ఒక్క గింజ కూడా ఉప్పుడు బియ్యం తీసుకోవద్దంటూ ఇటీవల ఎఫ్సీఐ ద్వారా కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సమస్యల్లో ఉన్న రైతులకు ఇది మరో సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది రైతులను తీవ్రంగా దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి జోక్యం చేసుకొని ఒడిశా, తెలంగాణతోపాటు ఉప్పుడు బియ్యం ఉత్పత్తి చేస్తున్న ఇతర రాష్ర్టాల రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి చొరవచూపాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ప్రసన్నాచార్య విజ్ఞప్తిచేశారు. ఉప్పుడు బియ్యం విషయంలో బీజేడీ రాజ్యసభ పక్షనేత ప్రసన్నాచార్య, ఛత్తీస్గఢ్ మంత్రి అమర్జిత్ భగత్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నాయకుల వద్ద సమాధానం ఉన్నదా? అని టీఆర్ఎస్ నాయకుడు కృశాంక్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న ఒడిశా రాష్ట్రం కూడా తెలంగాణ బాటలో నడవాలని నిర్ణయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగానే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాయాలని బీజేడీ లోక్సభాపక్ష నేత పినాకిన్ మిశ్రా సూచించారు. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ శుక్రవారం సీఎం కేసీఆర్తో ఫోన్లో సంభాషించినట్టు తెలుస్తున్నది. ఉప్పుడు బియ్యం కొనుగోళ్ల అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని పట్నాయక్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇది ఒక్క తెలంగాణ సమస్య కాదు. ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. కేంద్రం ఉప్పుడు బియ్యం కొనకపోతే మిగులు బియ్యాన్ని బంగాళాఖాతంలో పారబోయాలా? ఒడిశా, తెలంగాణ నుంచి ఒక్క గింజ కూడా ఉప్పుడు బియ్యం తీసుకోవద్దంటూ ఇటీవల ఎఫ్సీఐ ద్వారా కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి.
–రాజ్యసభలో బిజూ జనతాదళ్ పక్ష నేత ప్రసన్నాచార్య