మక్తల్, ఆగస్టు 27 : నారాయణపేట జిల్లా మక్తల్లో దారుణం చోటుచేసుకున్నది. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై ఆమె కన్నకొడుకు ఎదుటే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకొనేందుకు యత్నించిన ఆ బాలుడిపైనా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు బాధిత మహిళ రహస్యాంగాలు కోసి రాక్షసంగా ప్రవర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మక్తల్ పట్టణంలో ఓ మహిళ పదేండ్లుగా తన 12 ఏండ్ల కొడుకుతో కలిసి ఉంటున్నది. జీవనోపాధి కోసం యాచకురాలిగా ప్రధాన కూడలితోపాటు బస్ స్టాండ్ వద్ద తిరుగుతుండేది. రాత్రి సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తలదాచుకుంటున్నది. గురువారం కూడా అదే భవనంలో తలదాచుకున్నది.
తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కళాశాల భవనం వద్దకు వెళ్లారు. నిద్రపోతున్న మహిళపై లైంగికదాడికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో నిద్ర నుంచి కుమారుడు లేచి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అతడిపై ఆ ఇద్దరూ దాడి చేయడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత మహిళపై విచక్షణారహితంగా ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం మహిళ రహస్యాంగాలను కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న మహిళను.. ఉదయం కాలేజీ గ్రౌండ్లోకి వాకింగ్కు వచ్చిన స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మహిళను చికిత్స నిమిత్తం మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించి, నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.