మహబూబాబాద్ : ఛత్రపతి శివాజీ మహారాజ్ భరత మాత ముద్దుబిడ్డ అని, ఆయన చరిత్ర స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బీఆర్ఎస్ కార్యాలయంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
హిందూ వాహిని అధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మహానుయోధుడని కొనియాడారు. స్త్రీలను గౌరవించి, హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడని ప్రశంసించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలను, ఆశయాలను పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలని సూచించారు. యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా ధర్మ రక్షణ కొరకు పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో స్పీకర్ ..
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మోస్రా మండలం గోవూరు వద్ద తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.