హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గొర్రెలు, మేకల పంపిణీ పథకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలుచేసేందుకు మహారాష్ట్ర సిద్ధమవుతున్నది. ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ శశాంక్ కాంబ్లే తెలంగాణలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరు గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో గొర్రెలు, మేకల పంపిణీ పథకం బాగున్నదని, దీనిని తమ రాష్ట్రంలోనూ అమలుచేస్తామని చెప్పారు. ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు తెలంగాణకు వచ్చానని తెలిపారు. త్వరలో మహా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.
పెరిగిన మాంసం ఉత్పత్తి
ఈ పథకం అమలు తీరుతెన్నుల గురించి దూదిమెట్ల బాల్రాజ్ అవగాహన కల్పించా రు. రూ.12 వేల కోట్ల ప్రణాళికతో ఈ పథకా న్ని ప్రారంభించగా, తొలి విడతలో రూ.5 వేల కోట్లతో 3.94 లక్షల మందికి 82.74 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని వివరించారు. రెండో విడతలో రూ.6 వేల కోట్లు ఖర్చుతో 3.5 లక్షల మందికి పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. పథకంతో తెలంగాణ గొర్రెలసంఖ్యలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని, మాంసం ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో మహారాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యదర్శి వికాస్, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ రామచందర్ పాల్గొన్నారు.