హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఐటీ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ తమ కమిటీ ముందు ఇచ్చిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. రాష్ట్రంలో ఐటీ వృద్ధి, వివిధ రంగాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం, వాటి వల్ల ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం బుధవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ శశిథరూర్ గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘మంత్రి కేటీఆర్, ఆయన బృందం ఇచ్చిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉన్నది. విదేశాంగ విధానం మాదిరిగానే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ ఐటీ పాలసీపై దృష్టి పెట్టాల్సి ఉన్నదని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఐటీ రంగ ఫలాలను అందించడంలో మంత్రి కేటీఆర్ తెలంగాణను ఒక ఉదాహరణగా నిలుపుతున్నారు. ఈ ఐటీ పాలసీ ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు’ అని శశిథరూర్ ట్వీట్ చేశారు. ‘సైబర్ సెక్యూరిటీ మొదలు డాటా ప్రొటెక్షన్, సెమీ కండక్టర్ ఫాబ్రికేషన్ వంటి ఐటీ సంబంధ అంశాలు, మూడు ‘ఐ’లు.. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెన్షన్, ఇన్క్యూజన్పై మంత్రి కేటీఆర్తో చర్చించడం చాలా ఉత్సాహాన్ని కలిగించింది’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు.