కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామాలయంలో విజయదశమి మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా, నేడు సంతాన లక్ష్మి అలంకారంలో దర్శనిమిచ్చారు.
వేడుకలలో భాగంగా లక్ష్మితాయారు అమ్మవారికి వేదపండితులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన రాజభోగం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సామూహిక లక్ష కుంకుమార్చనలు చేయనున్నారు. రాత్రి 8 గంటలకు సీతారాముల నిత్యకల్యాణమూర్తులకు తిరువీధి సేవ నిర్వహిస్తారు. మహోత్సవాల్లో భాగంగా రేపు అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ నెల 15 వరకు మహోత్సవ వేడుకలు జరుగనున్నాయి.