హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య, ఉత్తర దిశ నుంచి చలి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి పెరుగుతున్నదని పేర్కొన్నది. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. హైదరాబాద్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మల్కాజిగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రతగా 11.6 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో చలి తీవ్రత కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.