నెక్కొండ/బూర్గంపహాడ్/అయిజ రూరల్, మే 25: తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం గాలివాన దుమారం రేపింది. పిడుగులు పడటం తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభా లు నేలకొరిగాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యంపై పరదా కప్పుతుండగా పిడుగుపడి అనంతగిరి సతీశ్ అనే రైతు చేతులు, కాళ్లు కాలిపోయాయి. ఆ సమయంలో సతీశ్ వద్ద సెల్ఫోన్, చేతిలో గడ్డపార ఉండటం వల్ల తీవ్రంగా గాయాలైనట్టు గ్రామస్థులు చెప్తున్నారు. సతీశ్ పక్కనే ఉన్న ఆయన భార్య లావణ్యతోపాటు పలువురు రైతులు సురక్షితంగా పిడుగుపాటు నుంచి బయటపడ్డారు.
తీవ్రంగా గాయపడిన సతీశ్ను చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. ఇదే మండలంలోని గుండ్రపల్లిలో పిడుగుపడి తాటిచెట్టు మంటల్లో కాలిపోయింది. భదాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లిబంజర, నకిరిపేట, లక్ష్మీపురం గ్రామాల్లో గాలిదుమారానికి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు రహదారులపై నేలకూలడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకాపురం గ్రామంలో చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.