హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ సిబ్బందికి జాతీయ స్థాయిలో ‘అతి విశిష్ట రైలు సేవా పురస్కార్-2023’ కు సంబంధించిన ఏడు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులు ఈ నెల 15న న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా అందుకోనున్నారు. అవార్డులకు ఎంపికైన వారిలో కాజీపేట డిప్యూటీ చీఫ్ ఇంజినీరింగ్ డీఎస్ రామారావు, విజయవాడకు చెందిన సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సీహెచ్ దినేష్రెడ్డి పురస్కారాలు అందుకోనున్నారు.
సికింద్రాబాద్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ మల్లెల శ్రీకాంత్, డివిజనల్ సిగ్నల్-టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ సి శివకుమార్ కశ్యప్, నిజామాబాద్ ఆర్పీఎఫ్ మహిళా సబ్-ఇన్స్పెక్టర్ టి. ప్రత్యూష, సికింద్రాబాద్ ముఖ్య టిక్కెట్ ఇన్స్పెక్టర్ టీ నటరాజన్, బీదర్ ట్రాక్ మెయింటెన్స్ గ్రేడ్-1 ఇంజినీర్ వీ వీ రంగయ్య పురస్కారాలు అందుకోనున్నారు.
పలు రైల్వే స్టేషన్ల మధ్య14 ప్రత్యేక రైళ్లు..
ఎస్సీఆర్ పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి 14 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ఎంబీఆర్ సెంట్రల్- వారణాసి, కన్యాకుమారి-వారణాసి, కోయంబత్తూరు-వారణాసి వంటి రైల్వే స్టేషన్ల మధ్య ఈ నెల 15 నుంచి జనవరి 1 వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు రైల్వే వెబ్సైట్లో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు.