హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా మన ఎస్హెచ్జీ మహిళలు సాధించిన విజయాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆ విజయాలను చూసి తమ రాష్ట్రంలోని మహిళలకు కూడా శిక్షణ ఇవ్వాలని అనేక రాష్ర్టాలు కోరుతున్నాయి. ఈ మేరకు మన రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ర్టాలతో పరస్పర అవగాహన ఒప్పందాలు జరుగగా.. లఢక్లో మహి ళా సంఘాలను ఏర్పాటు చేయడం, ఇప్పుడున్న సంఘాలను బలోపేతం చేయడం, తదితర అంశాలపై తెలంగాణ మహిళా సంఘాలు సేవలు వినియోగించుకోవడానికి సెర్ప్తో శనివా రం ఒప్పందం చేసుకున్నారు. లఢక్ లె ఫ్ట్నెంట్ గవర్నర్ సలహాదారు ఉమాం గ్ నరంగ్, సెర్ప్ డైరెక్టర్ వై నర్సింహారెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో లఢక్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి బిశ్వాస్, లఢక్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ఎండీ తాహిర్, తెలంగాణ నుంచి ప్రాజెక్టు మేనేజర్ రవీందర్రావు, వరంగల్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు యమున పాల్గొన్నారు.
45 రోజులు లఢక్లోనే..
ఈ ఒప్పందం ఏడాదిపాటు అమ ల్లో ఉంటుంది. వరంగల్ జిల్లాకు చెం దిన ఎంపిక చేసిన 40 మంది ఎస్హెచ్జీ మహిళలు లఢక్లో తొలివిడతలో 45 రోజులపాటు ఉంటారు. అక్కడి మహిళల్లో మహిళా సంఘాల ఏర్పా టు, ప్రాధాన్యం, ప్రయోజనాలు, సం ఘాలు ఏర్పాటు కాకముందు తెలంగాణ మహిళల ఆర్థిక పరిస్థితి, సంఘాల ఏర్పాటు తర్వాత ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తారు. బ్యాంకు రుణాల సద్వినియోగం, ఆర్థికంగా ఎదగడం, మహిళా సాధికారిత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. సామాజిక సమస్యలు, ఐక్యత ద్వారా సాధించే విజయాలు, సమావేశాలు, వీవోఏల పాత్ర, ఎస్హెచ్జీ అధ్యక్షురాలి పాత్ర తదితర అంశాలను వివరిస్తారు. ఇప్పటి వరకు మహిళా సంఘాల్లో చేరని వారిని సంఘాల్లో చేరే విధంగా కృషిచేస్తారు. వీరికి రోజు రూ.1750, రవాణా, వసతి సౌకర్యాన్ని లఢక్ ప్రభుత్వం కల్పిస్తుంది.